Monday, October 18, 2021

ఆ అధికారుల దవడ పగలగొట్టండి... కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమందిలో అయినా మార్పు వస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. అవి అర్హులకు ఎలా అందుతున్నాయన్న దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. పేదోళ్లు ఆడబిడ్డ పెళ్లి చేసి అప్పులపాలు కావద్దనే ‘కళ్యాణలక్ష్మి’ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. అయితే ఈ పథకంలోనూ కొందరు అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొందరు అధికారులు ‘కేసీఆర్ లక్ష ఇస్తుండు.. నాకేమిస్తావ్’ అని ప్రజల నుంచి లంచం ఆశిస్తున్నారని మండిపడ్డారు. అలా అధికారులెవరైనా లంచం అడిగితే దవడ పగలగొట్టాలని, ఏమన్నా అయితే తాను చూసుకుంటానని కేసీఆర్ అన్నారు. ఇద్దరు ముగ్గురి దవడ సరిచేస్తే అందరూ సక్కగైతారని, ఎక్కడికక్కడ నిలదీస్తేనే కొంతమందికైనా సిగ్గొస్తుందని వ్యాఖ్యానించారు.