Monday, October 18, 2021

ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లడం లేదు - సీఎం కేసీఆర్

ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్‌ సభ్యులు, నేతల ఉద్దేశించి సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజరాబాద్‌లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. హుజురాబాద్‌లో విజయం మనదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. నవంబర్ 15న వరంగల్‌ ప్రజాగర్జన సభను నిర్వహించాలన్నారు. ఇక నుంచి ప్రతీ రోజు 20 నియోజక వర్గాల సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్‌లో నిర్వహించాలన్నారు. అంతే కాకుండా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ముందస్తుకు వెళ్లడం లేదని ప్రకటించారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇంకా రెండేళ్లు ఉంది. అన్ని పనులు చేసుకుందామని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్‌లో ప్రజాగర్జన సభ నిర్వహించాలని సీఎం సూచించారు. వరంగల్‌ సభపై కేటీఆర్‌ అధ్యక్షతన నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో వచ్చే నెల 15న వరంగల్‌లో తలపెట్టిన తెలంగాణ విజయగర్జన సభ తదితర అంశాలపై చర్చించారు.