Tuesday, October 1, 2019

నర్సరీ, ఎల్‌కేజీ టాపర్లా.. నెటిజన్ల తీవ్ర విమర్శలు..


10, 10, 9.8, 9.7.. నర్సరీ విద్యార్థుల ప్రభంజనం.. 10, 10, 10 ఫస్ట్ క్లాస్ టాపర్స్.. ఎల్‌కేజీ విద్యార్థుల ర్యాంకుల పంట, యూకేజీ టాపర్స్.. టీవీ ఛానళ్లలో ఇలా నర్సరీ విద్యార్థుల ర్యాంకుల పంట అంటూ ప్రకటనలు హోరెత్తించినా ఆశ్చర్యపోవద్దు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలకు కూడా ర్యాంకులా.. విడ్డూరం కాకపోతేనూ అంటారా.. అవును మరి. మన ప్రైవేట్ స్కూళ్ల మధ్య పోటీతో చదువు'కొనడం' చివరికి ఇలా తయారైంది. అది కూడా మన రాజధాని హైదరాబాద్‌లోనే.

భాగ్యనగరంలోని కొత్తపేటలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ తమ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల ర్యాంకులు, గ్రేడింగ్‌లతో ఓ భారీ కటౌట్ ఏర్పాటు చేయించింది. నర్సరీలో 10 మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణులు కాగా.. వారిలో ఇద్దరికి పదికి పది పాయింట్లు వచ్చాయని ఘనంగా చెప్పుకుంది. ఇక ఎల్‌కేజీలో 14 మంది, యూకేజీలో 11 మంది, ఒకటో తరగతిలో 9 మంది ఫస్ట్ క్లాస్‌తో పాసయ్యారని రాసుకొచ్చిందివిద్యార్థుల పేర్లను ఫొటోలు సహా బిల్‌బోర్డుపైకి ఎక్కించిన సదరు పాఠశాల యాజమాన్యం తీరు చర్చనీయాంశంగా మారింది. పాఠశాల నిర్వాకానికి సంబంధించిన ఫొటోను ఆదివారం (సెప్టెంబర్ 29) ఓ నెటిజన్‌ ట్విటర్‌ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ పిల్లలు వేగంగా పాలు తాగడంలో టాపర్లా అంటూ కామెంట్ పెట్టారు.

నెటిజన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పాఠశాల తీరుపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే నర్సరీ విద్యార్థుల ఆత్మహత్యలను చూడటానికి ఎంతో కాలం పట్టదని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లలను విద్యార్థులుగా భావించరనే కనీస ఇంగితజ్ఞానం కూడా లేదంటూ మరికొంత మంది నెటిజన్లు సదరు పాఠశాలపై దుమ్మెత్తి పోశారు. వారి మార్కెట్‌ను పెంచుకోవడానికి పిల్లలేమీ వస్తువులు కాదంటూ మండిపడుతున్నారు. ఇలాగైతే చిన్నపిల్లల్లోనూ ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుందని కొంత మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ స్కూల్‌కు సంబంధించిన ఫోటోను వాట్సాప్‌లోనూ షేర్ చేసుకుంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.


ఈ అంశంపై ఇటు పాఠశాల యాజమాన్యం కానీ, అటు విద్యాశాఖ అధికారులు కానీ స్పందించలేదు. తల్లిదండ్రులూ.. ఇలాంటి పాఠశాలల మాయలో పడి మీ పిల్లల జీవితాన్ని అంధకారంలో పడేయ్యొద్దు, వారిని ఒత్తిడిలోకి నెట్టొద్దు. ఆలోచించండి..!!