Thursday, October 10, 2019

ఆర్టీసీలో పీఎఫ్ సొమ్ము మాయం: ఏడు వేల దరఖాస్తులు పెండింగ్: కార్మికుల్లో ఆందోళన..!


తెలంగాణ ఆర్టీసీలో మరో కొత్త అంశం కార్మికులు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీసీ పీఎఫ్ ఖాతా నుండి దాదాపు వెయ్యి కోట్లు మాయం అయినట్లు గుర్తించారు. కార్మికుల వేతం నుండి ప్రతీ నెల ఉద్యోగి భద్రత కింద పీఎఫ్ పేరుతో వసూలు చేసే మొత్తానికి అంతే మొత్తంలో యాజమాన్యం జమ చేస్తుంది. కానీ, తెలంగాణ ఆర్టీసీలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగినట్లుగా కార్మికులు చెబుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా రూ.826 కోట్లను పీఎఫ్‌ ఖాతాకు జమ చేయకుండా వాడేసుకుందని ఆరోపిస్తున్నారు. దీంతో..వివిధ కారణాలతో నగదు కోసం దరఖాస్తు ఏడు వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వాపోతున్నారు. కార్మికుల సొమ్ము వెంటనే తమ ఖాతాలకు జమ చేయాలని తమ సమ్మె డిమాండ్లలో ఒక్కటిగా పేర్కొంటున్నారు. ఆర్టీసీలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి, అధికారి నెల వేతనం నుంచి యాజమాన్యం 12 శాతం పీఎఫ్ కింద కోత వేస్తుంది. దానికి యాజమాన్యం మరో 12 శాతం కలుపుతుంది. మొత్తం 24 శాతంలో 8.33 శాతం సొమ్ము పింఛను ఖాతాకు జమ చేస్తోంది. మిగతా 15.67 శాతానికి సంబంధించిన సొమ్మును పీఎఫ్‌ కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ట్రస్టు ఖాతాలో జమ చేయాలి. కానీ.. ఈ సొమ్ము ట్రస్టులో జమ కావడం లేదు. దీనిని ఆర్టీసీయే వాడేసుకుంటోంది. 2014 నుంచి మధ్య మధ్యలో కొంత జమ చేసినా.. ఇప్పటి వరకూ వాడేసుకున్న సొమ్ము రూ.826 కోట్లుగా తేలింది. కార్మికులకు సంబంధించిన పీఎ్‌ఫను ఏళ్ల తరబడి జమ చేయకపోవడంతో పీఎఫ్‌ కమిషనరేట్‌ రెండుసార్లు ఆర్టీసీకి షోకాజ్‌ నోటీసులు పంపింది. ఇలా ఆర్టీసీకి 2016లో ఒకసారి, 2017లో మరోసారి ఇలాంటి నోటీసులు వచ్చాయి. కేసులు నమోదయ్యాయి. అయినా, కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుని మరీ ఆర్టీసీ యాజమాన్యం డబ్బు బదలాయించకుండా వాడేసుకుంటోంది. రెండేళ్ల నుంచి పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌ నిలిచిపోయాయి. దీంతో, ఆగ్రహించిన పీఎఫ్‌ కార్యాలయం ఆర్టీసీని బ్లాక్‌ లిస్టులో పెట్టింది. అయినా.. సంస్థలో మార్పు లేదు. కార్మికుల సొమ్ముపై కించిత్తు ఆందోళన లేదు. సాధారణంగా కార్మికులకు పీఎఫ్‌ సొమ్మును డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ.. వారి పీఎఫ్‌ ఖాతాల్లో సొమ్ము లేకపోవడంతో ఆపత్కర సమయాల్లో డబ్బు విత్‌డ్రా చేసుకునే వీలుండడం లేదు. ఇప్పటి వరకూ 7000కుపైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి.కార్మికులు చెబుతున్న సమాచారం మేరకు పీఎఫ్‌ సొమ్ము మాత్రమే కాదు.. సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ పథకాల కింద కార్మికులు జమ చేసుకుంటున్న డబ్బును ఏళ్ల తరబడి ఆర్టీసీ సంస్థ అవసరాలకు మళ్లిస్తోందని వాపోతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకూ వెయ్యి కోట్లకుపైగా వాడుకున్నట్లు ఆర్టీసీ యూనియన్లు ధ్వజమెత్తుతున్నాయి. రిటైరైన సిబ్బందికి సెటిల్‌మెంట్‌ కింద చెల్లించే సొమ్మును కూడా వెంటనే ఇవ్వడం లేదనే ఫిర్యాదు ఉంది. ఇలా ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీలకు సంబంధించి రూ.1000 కోట్లను ఆర్టీసీ వాడుకుందని కార్మిక యూనియన్లు భగ్గుమంటున్నాయి.