Friday, November 22, 2019

కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న ఏఎస్‌ఐ

కిరోసిన్ పోసుకొని నిప్పు పెట్టుకున్న ఏఎస్‌ఐ





ఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో కలకలం రేపింది. ఏఎస్‌ఐ నరసింహులు శుక్రవారం (నవంబర్ 22) మధ్యాహ్నం  పోలీస్ స్టేషన్ సమీపంలోని నీళ్ల ట్యాంక్ ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన తోటి ఉద్యోగులు మంటలార్పి అతడిని కిందకు తీసుకొచ్చి.. సమీపంలోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. 30 శాతానికి పైగా కాలిన గాయాలతో ఏఎస్‌ఐ నరసింహులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహించిన నరసింహులు ఇటీవలే మంచాల పీఎస్‌కు బదిలీ అయ్యారు. ఓ కానిస్టేబుల్‌తో ఆయన గొడవపడటం వివాదాస్పదంగా మారడంతో బదిలీ వేటు వేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఏఎస్‌ఐ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏఎస్‌ఐ నరసింహ ఇటీవల తన బావమరిదికి సంబంధించిన ఓ ఫంక్షన్‌లో కానిస్టేబుల్ దశరథ్‌తో గొడపపడ్డారు. తాగిన మైకంలో ఆయనపై దుర్భాషలాడారు. అందుకు సంబంధించిన ఆడియో వాయిస్ వైరల్ అయింది. ఏఎస్‌ఐ నరసింహపై కానిస్టేబుల్ దశరథ్ బాలాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించారు. కానిస్టేబుల్‌తో ఏఎస్‌ఐ గొడవ విషయం కమిషనర్ మహేశ్ భగవత్‌ వరకూ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయణ్ని మంచాలకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. బాలాపూర్ ఎస్‌ఐ సైదులు, ఇతర సిబ్బంది కలిసి ఏఎస్‌ఐ నరసింహ, కానిస్టేబుల్ దశరథ్‌కు రాజీ కుదిర్చినట్లు సమాచారం. అయితే.. నరసింహ మాత్రం బదిలీ వేటు నుంచి తనను తాను కాపాడుకోలేకపోయారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నరసింహులు గురువారం మంచాల పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేశారని.. శుక్రవారం విధులకు హాజరు కావాల్సి ఉండగా పీఎస్‌కు రాలేదని మంచాల సీఐ అనుదీప్ తెలిపారు. ఘటనలో నరసింహులు చేయి, తొడ, కడుపు భాగాల్లో గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.